PRAJA SANKSHEMAM NEWS
Newspaper Banner
Date of Publish : 29 August 2026, 3:39 pm Posted by : Praja Sankshemam News

ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేయాలి…!!!

సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ…!!!
ప్ప్రజాసంక్షేమం న్యూస్:

ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ చైర్మన్ డాక్టర్ కె. కేశవరావు (కేకే) నేతృత్వంలోని కమిటీ ప్రతినిధి బృందం శనివారం డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డిని కలిసి ఉద్యమకారుల గుర్తింపు,సంక్షేమానికి సంబంధించిన అంశాలపై చర్చించింది.ఈ సమావేశంలో ఎమ్మెల్సీ ప్రొఫెసర్ ఎం.కోదండరామ్,కమిటీ ఎగ్జిక్యూటివ్ సభ్యుడు మోతె శోభన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఎస్.రాములు నాయక్ పాల్గొన్నారు.ఇటీవల హైదరాబాద్‌లోని అమరవీరుల స్మారక చిహ్నం (అమరదీపం) వేదికగా నిర్వహించిన విస్తృత స్థాయి సంప్రదింపుల వివరాలను కమిటీ ముఖ్యమంత్రికి వివరించింది.ఈ సంప్రదింపుల్లో 13 వేల మందికి పైగా తెలంగాణ ఉద్యమకారులతో పాటు వివిధ జేఏసీలు,ప్రజాసంఘాలు,కవులు,కళాకారులు,మహిళా ఉద్యమకారులు పాల్గొన్నట్లు కమిటీ తెలిపింది.ఉద్యమకారుల నుంచి సేకరించిన అభిప్రాయాలు,విజ్ఞప్తులతో పాటు ఉద్యమకారుల వర్గీకరణకు సంబంధించిన ముసాయిదా నివేదికను ముఖ్యమంత్రికి సమర్పించింది.తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమకారులు చేసిన త్యాగాలను గుర్తిస్తూ వారి సేవలకు తగిన గౌరవం కల్పించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నట్లు కమిటీ వెల్లడించింది.ఉద్యమకారుల గుర్తింపు,సంక్షేమానికి సంబంధించిన కసరత్తును ఎలాంటి జాప్యం లేకుండా త్వరితగతిన పూర్తి చేయాలని సీఎం సూచించారు.ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియ కోసం అధికారిక వెబ్‌సైట్,పోర్టల్ ఏర్పాటు,డిజిటల్ దరఖాస్తుల స్వీకరణ, జిల్లాల వారీగా సమన్వయం,అవసరమైన పరిపాలనా వనరుల కల్పన వంటి అంశాల్లో కమిటీకి పూర్తి సహకారం అందించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.సమావేశంలో సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వి.శేషాద్రి,ఐఏఎస్,సీఎం కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి, ఐఏఎస్, వి.పి. గౌతమ్, ఐఏఎస్, ఎస్. శ్రీధర్,ఐఏఎస్,ముఖ్యమంత్రి ఓఎస్డీలు,ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల ప్రధాన డిమాండ్లైన 250 గజాల నివాస స్థలాలు, ఆసరా పెన్షన్, ఆరోగ్య కార్డులు,ఆర్టీసీ ఉచిత ప్రయాణ సౌకర్యం,ఉద్యోగులకు గౌరవ గుర్తింపు తదితర అంశాలను కమిటీ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లింది.ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు జీవో నెం. 679 ద్వారా తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీని ఏర్పాటు చేయడంతో పాటు, ఉద్యమకారుల సంక్షేమానికి సంబంధించిన డిమాండ్లపై సానుకూలంగా స్పందించినందుకు కమిటీ చైర్మన్ డాక్టర్ కె.కేశవరావు,ప్రొఫెసర్ ఎం.కోదండరామ్, మోతె శోభన్‌రెడ్డి,ఎస్.రాములు నాయక్ ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు..