PRAJA SANKSHEMAM NEWS
Newspaper Banner
Date of Publish : 15 August 2026, 7:46 am Posted by : Praja Sankshemam News

తెలంగాణలో రైతుబీమాపై అనిశ్చితి.. ప్రీమియం చెల్లింపు గడువు ముగిసినా చెల్లింపులు జరగలేదన్న ఆరోపణలు

హైదరాబాద్, ఆగస్టు 15:  తెలంగాణలో రైతు కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించే రైతుబీమా పథకంపై అనిశ్చితి నెలకొంది. 2026–27 సంవత్సరానికి రైతుబీమా ప్రీమియం చెల్లింపు గడువు ఆగస్టు 14తో ముగిసినా, ప్రభుత్వం ఇప్పటివరకు ప్రీమియం చెల్లించలేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అకాల మరణం చెందిన రైతు కుటుంబాలకు రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందించాలనే ఉద్దేశంతో 2018లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబీమా పథకాన్ని ప్రారంభించింది. ఎల్‌ఐసీతో కలిసి ఈ పథకాన్ని అమలు చేస్తూ వస్తున్నారు. ప్రతి ఏడాది ఆగస్టు 14వ తేదీలోపు సుమారు రూ.1,400 కోట్ల ప్రీమియం చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంటున్నారు. అయితే 2026–27 సంవత్సరానికి సంబంధించి ప్రీమియం చెల్లింపుపై స్పష్టత లేకపోవడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.ప్రస్తుతం సుమారు 42.16 లక్షల మంది రైతులు ఈ పథకం పరిధిలో ఉన్నారని పేర్కొంటున్నారు. పథకం కొనసాగింపుపై ప్రభుత్వం వెంటనే స్పష్టత ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. రైతుబీమా పథకం నిలిచిపోతే అకాల మరణం చెందే రైతుల కుటుంబాలకు అందే రూ.5 లక్షల భద్రతపై ప్రభావం పడే అవకాశం ఉందని ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వం తక్షణమే ప్రీమియం చెల్లించి రైతుబీమా పథకాన్ని నిరంతరాయంగా కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నాయి.