పోక్సో కేసు నిందితుడికి 10 ఏళ్ల జైలుశిక్ష..5వేల జరిమానా 7 లక్షల పరిహారం…
ఏళ్ల తరబడి కొనసాగిన కేసు విచారణకు న్యాయస్థానం తీర్పుతో ముగింపు.!
(ప్రజాసంక్షేమం న్యూస్-నల్లగొండ)
2020 సెప్టెంబర్ 8న డిండి పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ బాలికకు సంబంధించిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు అందింది.ఆ రోజు జరిగిన ఘటనతో మొదలైన పోలీసుల దర్యాప్తు చివరకు నిందితుడికి శిక్ష పడే వరకు సాగింది.బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు FIR నంబర్ 97/2020 నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.విచారణలో ప్రతాప్నగర్కు చెందిన ఆటో డ్రైవర్ మూడవత్ మల్లేష్పై ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి.కేసు దర్యాప్తులో పోలీసు అధికారులు కీలక ఆధారాలను సేకరించి నిందితుడిపై అభియోగపత్రం దాఖలు చేశారు.సెషన్స్ కేసు నంబర్ 101/2021గా విచారణ కొనసాగింది..
కోర్టులో ప్రాసిక్యూషన్ తరఫున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వేముల రంజిత్ కుమార్ బలమైన వాదనలు వినిపించారు.సాక్ష్యాధారాలను పరిశీలించిన నల్లగొండ జిల్లా POCSO న్యాయస్థానం నిందితుడు మూడవత్ మల్లేష్కు 10 ఏళ్ల కారాగార శిక్ష విధించింది.అదే సమయంలో రూ.5 వేల జరిమానా విధించడంతో పాటు బాధితురాలికి రూ.7 లక్షల పరిహారం ప్రకటించింది.ఈ కేసు దర్యాప్తులో అప్పటి SHO ఎం రాములు, అప్పటి CI డి వెంకటేశ్వర్లు, ప్రస్తుత SHO సిహెచ్ బాలకృష్ణ, ప్రస్తుత CI కే బీసన్న, CDO పి లింగయ్య, భరోసా లీగల్ ఆఫీసర్ మామిడి కల్పన తదితరులు సహకరించారు..