PRAJA SANKSHEMAM NEWS
Newspaper Banner
Date of Publish : 29 August 2026, 3:02 pm Posted by : Praja Sankshemam News

నీటి వినియోగ సామర్థ్యాన్ని పెంచే సాంకేతిక యూనిట్లతో చిన్న నీటిపారుదల వ్యవస్థను తిరిగి ఏర్పాటు చేయాలి:రైతు సంక్షేమ కమిషన్

ప్రజాసంక్షేమం న్యూస్ :
రాష్ట్రంలో చిన్న నీటిపారుదల వ్యవస్థపై వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారిని కలిసి నివేదిక అందించింది. నీటి వినియోగ సామర్థ్యాన్ని పెంచే సాంకేతిక యూనిట్లతో చిన్న నీటిపారుదల వ్యవస్థను తిరిగి ఏర్పాటు చేయాలని కమిషన్ తన నివేదికలో సూచించింది.తెలంగాణ వ్యవసాయ – రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ఎం. కోదండ రెడ్డి గారి నేతృత్వంలో సభ్యులు రాములు నాయక్ గారు, రాంరెడ్డి గోపాల్ రెడ్డి గారు, గంగాధర్ గారు, ఎం. భవానీరెడ్డి గారు ముఖ్యమంత్రి గారిని జూబ్లీహిల్స్ నివాసంలో కలిసి నివేదిక అందించారు.కమిషన్ సిఫారసులపై ముఖ్యమంత్రి గారు వారితో చర్చించారు. పంటల మార్పిడి, ఉద్యానవన పంటల సాగు పెంపు, ఎఫ్‌పీవోల ఏర్పాటు వంటి అంశాలపై కమిషన్ దృష్టి పెట్టాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు సూచించారు.రాష్ట్రంలో చిన్న నీటిపారుదల వ్యవస్థను మెరుగుపరచడానికి నివేదికలో కమిషన్ ప్రభుత్వానికి పలు కీలక సూచనలు చేసింది. చిన్న, పెద్ద నీటిపారుదల వనరులను కలిపే కమాండ్ ఏరియా ఆధారిత నిర్వహణ వ్యవస్థలు ఏర్పాటు చేయాలని సూచించింది.చెరువుల పరిరక్షణకు ప్రత్యేకంగా చిన్న నీటిపారుదల చట్టం రూపొందించాలని, చెరువుల ఫుల్ ట్యాంక్ లెవల్ (FTL) సరిహద్దులను తక్షణం గుర్తించి ఆక్రమణలను తొలగించి పరిరక్షించాలని సూచించింది. తెలంగాణలో నీటి భద్రత, వ్యవసాయ స్థిరీకరణ, గ్రామీణ జీవనోపాధుల అభివృద్ధికి చెరువుల పునరుద్ధరణ అత్యంత అవసరమని తెలిపింది. గడిచిన రెండేళ్ల కాలంలో రైతు కమిషన్ చేపట్టిన కార్యక్రమాలు, ప్రభుత్వానికి అందించిన సూచనలను కమిషన్ ప్రతినిధి బృందం వివరించింది. కమిషన్ పనితీరుపై ముఖ్యమంత్రి గారు సంతృప్తిని వ్యక్తం చేశారు.