పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలి.. నిందితులకు శిక్ష పడేలా పక్కా ఆధారాలు సేకరించాలి
నల్గొండ జిల్లాలో నేర నియంత్రణ, పెండింగ్ కేసుల దర్యాప్తు పురోగతి, నేరాల నివారణకు చేపడుతున్న చర్యలు, సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ పోలీసు అధికారులతో నేర సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లాలో నమోదవుతున్న నేరాల తీరు, కేసుల దర్యాప్తు పురోగతిని సమగ్రంగా సమీక్షించిన ఎస్పీ.. ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తు చేపట్టి, నిందితులకు శిక్ష పడేలా పక్కా ఆధారాలు సేకరించాలని ఆదేశించారు. పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి, నిర్ణీత కాలపరిమితిలో కేసులను పరిష్కరించాలని సూచించారు.కేసుల దర్యాప్తులో ‘ఈ-సాక్ష్య’ యాప్, CCTNS వంటి సాంకేతిక వ్యవస్థలను ప్రతి దర్యాప్తు అధికారి సమర్థవంతంగా వినియోగించాలని ఎస్పీ ఆదేశించారు. ఆధారాలను శాస్త్రీయంగా భద్రపరచడంతో పాటు కోర్టులో నిందితులకు శిక్ష పడేలా దర్యాప్తును బలోపేతం చేయాలని సూచించారు.నేరాలు జరిగిన తర్వాత స్పందించడమే కాకుండా.. నేరాలు జరగకుండా ముందస్తు చర్యలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఎస్పీ స్పష్టం చేశారు. పాత నేరస్తులు, అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై నిరంతరం నిఘా కొనసాగించాలని, బీట్ పోలీసింగ్ను మరింత బలోపేతం చేయాలని ఆదేశించారు.
📹 సీసీ కెమెరాల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి : నేరాల నియంత్రణ, నేరస్తుల కదలికల గుర్తింపు, నేరాల ఛేదనలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తున్నందున పట్టణాలు, ప్రధాన కూడళ్లు, రద్దీ ప్రాంతాలు, ముఖ్యమైన రహదారులు, నేరాలు జరిగే అవకాశం ఉన్న ప్రాంతాల్లో మరిన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఇప్పటికే ఉన్న కెమెరాలు నిరంతరం పనిచేసేలా పర్యవేక్షించాలని ఆదేశించారు.
⚠️ సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి : పెరుగుతున్న సైబర్ నేరాలను అరికట్టేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని ఎస్పీ సూచించారు. సైబర్ మోసాలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని, ఫిర్యాదు అందిన వెంటనే స్పందించి బాధితుల డబ్బు ఇతర ఖాతాలకు బదిలీ కాకుండా సత్వర చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.🚫 డ్రగ్స్పై నిరంతర నిఘా మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయం, వినియోగంపై నిరంతర నిఘా కొనసాగించాలని ఎస్పీ ఆదేశించారు. డ్రగ్స్ సరఫరా గొలుసును గుర్తించి అక్రమ రవాణాకు పాల్పడుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. యువతను మాదకద్రవ్యాలకు దూరంగా ఉంచేందుకు పాఠశాలలు, కళాశాలలు, గ్రామాలు, పట్టణాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు.
🚔 సరిహద్దుల్లో అక్రమ రవాణాపై నిఘా జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో అక్రమ రవాణా, ఇసుక అక్రమ మైనింగ్, పీడీఎస్ బియ్యం, ఇతర నిత్యావసర వస్తువుల అక్రమ తరలింపులను అరికట్టేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అనుమానాస్పద వాహనాలు, వ్యక్తుల కదలికలను నిరంతరం పరిశీలించాలని సూచించారు.ప్రజలు పోలీస్ స్టేషన్కు వచ్చినప్పుడు వారి సమస్యలను సానుకూలంగా విని, చట్టపరమైన పరిధిలో సత్వర పరిష్కారం చూపాలని ఎస్పీ సూచించారు. బాధితుల ఫిర్యాదులపై నిర్లక్ష్యం లేకుండా స్పందించి ప్రజలకు న్యాయం అందించాలని తెలిపారు.నేర నియంత్రణ, నేరాల ఛేదన, కేసుల దర్యాప్తు, కోర్టు కేసుల్లో శిక్షల శాతం పెంపుపై అధికారులు నిరంతరం దృష్టి సారించాలని ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశించారు.
ఈ సమావేశంలో అదనపు ఎస్పీ రమేష్, డీఎస్పీలు మల్లారెడ్డి, శ్రీనివాస్ రావు, రవి కుమార్, లక్ష్మి నారాయణ, సీఐలు, ఎస్ఐలు, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.