PRAJA SANKSHEMAM NEWS
Newspaper Banner
Date of Publish : 10 August 2026, 11:59 am Posted by : Praja Sankshemam News

ప్రజా,కుల సంఘాల నాయకులపై పోలీసుల చర్యలు ఆపాలి – అక్రమ అరెస్టులతో ఉద్యమాలను అడ్డుకోలేరు



ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రశ్నించే హక్కును ప్రభుత్వం గౌరవించాలి: గోలి సైదులు
ప్రజా సంక్షేమంన్యూస్

ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తూ, సామాజిక న్యాయం కోసం ప్రజాస్వామ్య పద్ధతిలో ఉద్యమిస్తున్న ప్రజా సంఘాలు, కుల సంఘాల నాయకులపై పోలీసు చర్యలు, అరెస్టులు, నిర్బంధాల ద్వారా ఉద్యమాలను అణచివేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని జాతీయ మాల మహానాడు నేషనల్ స్టీరింగ్ కమిటీ సభ్యులు గోలి సైదులు ఆరోపించారు.ఇటీవల నల్లగొండ పరిధిలోని పోలీస్ స్టేషన్ల వద్ద ప్రజా సంఘాలు, కుల సంఘాల నాయకులు పోలీసు అధికారులను కలిసి తమ సమస్యలు, ఉద్యమ కార్యక్రమాలు మరియు నాయకులపై తీసుకుంటున్న చర్యలపై మాట్లాడినట్లు తెలిపారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ల వద్ద నాయకులు జాతీయ మాల మహానాడు నేషనల్ స్టీరింగ్ కమిటీ మెంబర్ గోలి సైదులు, త్రిపురారం మండల పోలీస్ స్టేషన్లో జాతీయ మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి కామర్ల జానయ్య, మాల మహానాడు రాష్ట్ర నాయకులు చింతపల్లి లింగమయ్య, పి సి విద్యార్థి సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షులు అయితగోని జనార్దన్ గౌడ్, జాతీయ మాల మహానాడు జిల్లా ప్రధాన కార్యదర్శి కూన యాదయ్య మరియు ఇతర కార్యకర్తలు పోలీసు అధికారులతో కలిసి ఉన్న దృశ్యాలు నమోదయ్యాయి.
ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ విధానాలపై ప్రజా సంఘాలు ప్రశ్నలు లేవనెత్తుతున్నాయని, వాటికి సమాధానాలు ఇవ్వాల్సింది పోయి పోలీసు కేసులు, అరెస్టులు, నిర్బంధాల ద్వారా గొంతు నొక్కే ప్రయత్నం చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని గోలి సైదులు పేర్కొన్నారు.“ప్రజల సమస్యలను ప్రశ్నించడం నేరం కాదు. రాజ్యాంగం కల్పించిన హక్కుల కోసం శాంతియుతంగా పోరాడుతున్న నాయకులను, కార్యకర్తలను అరెస్టులు చేసి ఉద్యమాలను ఆపలేరు. ఒకరిని అరెస్టు చేస్తే ప్రశ్నించే గొంతులు మరింత పెరుగుతాయి” అని ఆయన అన్నారు.
ప్రజా సంఘాలు, కుల సంఘాల నాయకులపై ఏవైనా కేసులు నమోదు చేసినా అవి చట్టబద్ధమైన ప్రక్రియలో, పారదర్శకంగా ఉండాలని, అనవసరమైన నిర్బంధాలు లేదా వేధింపులకు పాల్పడవద్దని ఆయన పోలీసు అధికారులను కోరారు.
సామాజిక న్యాయం, ఎస్సీ హక్కులు, రిజర్వేషన్లు మరియు ప్రజల హక్కుల కోసం తమ పోరాటం కొనసాగుతుందని తెలిపారు. ప్రభుత్వం తమ డిమాండ్లపై చర్చించి పరిష్కారం చూపే వరకు ప్రజాస్వామ్య, శాంతియుత మార్గాల్లో ఉద్యమాన్ని కొనసాగిస్తామని గోలి సైదులు స్పష్టం చేశారు.
“అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని అడ్డుకోలేరు… ప్రజల గొంతును అణచలేరు.”