PRAJA SANKSHEMAM NEWS
Newspaper Banner
Date of Publish : 29 August 2026, 11:27 am Posted by : domalapallygopi@gmail.com

మట్టి వినాయకుడే ముద్దు.. పర్యావరణ పరిరక్షణే మన బాధ్యత!

బిచ్కుంద ఎస్‌ఐ జి. రాజుకు వినతిపత్రం సమర్పించిన సీసీఆర్ ప్రతినిధి సుశీల్ కుమార్
ఎంఆర్‌ఓ,ఎంపీడీఓ కార్యాలయాలకు కూడా వినతిపత్రాలు అందజేత

ప్రజా సంక్షేమం న్యూస్ (బిచ్కుంద, ఆగస్టు 29):
రానున్న వినాయక చవితి పండుగను పురస్కరించుకుని పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ,మట్టి వినాయక విగ్రహాల వినియోగాన్ని ప్రోత్సహించాలని కోరుతూ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలో అధికారులకు వినతిపత్రాలు అందజేశారు.సీసీఆర్ కామారెడ్డి ప్రతినిధి సుశీల్ కుమార్ బిచ్కుంద ఎస్‌ఐ జి.రాజును కలసి వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గ్రామాల్లో వినాయక మండపాలు ఏర్పాటు చేసే నిర్వాహకులకు ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (PoP) విగ్రహాలకు బదులుగా పర్యావరణహిత మట్టి విగ్రహాలను మాత్రమే ప్రతిష్టించేలా అధికారులు ముందస్తు అవగాహన కల్పించాలని కోరారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ మరియు రసాయన రంగులతో తయారుచేసిన విగ్రహాలను నీటిలో నిమజ్జనం చేయడం వల్ల చెరువులు, కాలువలు తీవ్రంగా కలుషితమై జలచరాలకు, మానవాళికి హాని కలుగుతుందని తెలిపారు.
అలాగే,ఎంఆర్‌ఓ(తహసీల్దార్),ఎంపీడీఓలతో పాటు ఇతర మండల పరిపాలనా కార్యాలయాల్లో కూడా వినతిపత్రాలు సమర్పించారు. గ్రామపంచాయతీలు,మున్సిపాలిటీలు, రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖల అధికారులు మరియు ప్రజాప్రతినిధులు సమన్వయంతో కృషి చేసి, ‘పర్యావరణ పరిరక్షణ – మనందరి బాధ్యత’ అనే సందేశాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేశారు. భక్తి, సంప్రదాయాలకు ప్రాధాన్యమిస్తూనే పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.