
ప్రజా సంక్షేమం న్యూస్
ప్రజలకు రవాణా సౌకర్యాలను మెరుగుపరచడానికి రోడ్ నెట్వర్క్కు సంబంధించిన అన్ని పనులను ఒకే వ్యవస్థ పరిధిలోకి తేవాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అధికారులకు చెప్పారు. హైదరాబాద్, హెచ్ఎండీఏ పరిధిలో అత్యంత కీలకమైన రోడ్ నెట్వర్క్ విస్తరణ, జరుగుతున్న పనుల పురోగతిపై ముఖ్యమంత్రి గారు ఉన్నతాధికారులతో సమీక్షించారు.ఎంసీఆర్ హెచ్ఆర్డీలోని బోధి పెవిలియన్లో జరిగిన ఈ సమీక్షలో హెచ్ఎండీఏ, హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రోడ్ల నిర్మాణంలో ప్రధానమైన భూసేకరణ, రుణ సేకరణ, నిర్వహణ వంటి అంశాలతో పాటు ఔటర్ రింగ్ రోడ్డు, రీజినల్ రింగ్ రోడ్డు, నగరంలోని ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు, ఇతర రోడ్లన్నింటినీ ఒకే వ్యవస్థ పరిధిలోకి తేవాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు సూచించారు.ఓఆర్ఆర్ నిర్వహణ సరిగా లేకపోవడం, దానిపై ఎక్కడికక్కడ వాహనాలను నిలపడం వల్ల అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని, ఓఆర్ఆర్ నిర్వహణపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు.రేడియల్ రోడ్ల నిర్మాణం వేగవంతం కావాలని, కొంగరకలాన్ నుంచి ఫ్యూచర్ సిటీ వరకు ప్రారంభించిన రేడియల్ రోడ్డు 1ను డిసెంబర్ 9వ తేదీ నాటికి పూర్తి చేయాలని నిర్ధేశించారు. రేడియల్ రోడ్ల నిర్మాణంలో ఎదురయ్యే అడ్డంకులను వీలైనంత తొందరగా పరిష్కరించాలని, రోడ్ల నిర్మాణ నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడొద్దని స్పష్టం చేశారు.రోడ్లకు ఇరువైపులా పచ్చదనం ఉండేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని,బుద్వేల్ ట్రంపెట్ ఇంటర్చేంజ్ నిర్మాణం, బంజారాహిల్స్ నుంచి శిల్పా లేఅవుట్ వరకు ఎలివేటెడ్ కారిడార్ పనులను త్వరగా మొదలుపెట్టాలని చెప్పారు.హైదరాబాద్ మహానగర భవిష్యత్తు రోడ్ల విస్తరణ, అభివృద్ధి పైనే ఆధారపడి ఉందని, అందుకోసం అవసరమైన భూ సేకరణ పనులను వేగవంతం చేయాలని,ఇందులో అలసత్వం చూపరాదని అధికారులకు స్పష్టంగా చెప్పారు. రోడ్ల విస్తరణకు జరిపే ల్యాండ్ పూలింగ్ విషయంలో మధ్యవర్తుల జోక్యం ఉండరాదని,టీడీఆర్లు జారీ చేసే విషయంలో కూడా ప్రత్యేకంగా ఒక కమిటీని ఏర్పాటు చేయాలని చెప్పారు.