PRAJA SANKSHEMAM NEWS
Newspaper Banner
Date of Publish : 20 August 2026, 3:27 pm Posted by : Praja Sankshemam News

వర్షాభావ పరిస్థితుల్లో రైతులు అప్రమత్తంగా ఉండాలి:మంత్రి ఉత్తమ్

సెప్టెంబర్–అక్టోబర్‌లో వర్షాలు తగ్గితే పరిస్థితి మరింత క్లిష్టం:
53 వేల ఎకరాలకు సాగునీరు అందించనున్న దొండపాడు లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పథకం:మంత్రి ఉత్తమ్

ప్రజా సంక్షేమం న్యూస్,సూర్యాపేట, ఆగస్టు 20:
రాష్ట్రంలో కొనసాగుతున్న వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు పంటల ప్రణాళికను జాగ్రత్తగా రూపొందించుకోవాలని నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి సూచించారు.సెప్టెంబర్‌,అక్టోబర్‌ నెలల్లో వర్షపాతం లోటు కొనసాగితే పరిస్థితి మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.సూర్యాపేట జిల్లాలో మహాత్మా గాంధీ ముక్త్యాల బ్రాంచ్‌ కెనాల్‌ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పథకం పనుల పురోగతితో పాటు జిల్లాలోని నీటి పరిస్థితిని మంత్రి గురువారం నీటిపారుదల శాఖ అధికారులతో కలిసి సమీక్షించారు.ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం వర్షపాతం,రిజర్వాయర్ల నీటిమట్టాలు,వరద ప్రవాహాలను నిరంతరం పర్యవేక్షిస్తోందని ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి తెలిపారు. సాగునీటి విడుదలపై నిర్ణయాలు అందుబాటులో ఉన్న వాస్తవ నీటి నిల్వలు,భవిష్యత్‌ నీటి లభ్యతపై అంచనాల ఆధారంగానే తీసుకుంటామని చెప్పారు.వర్షపాతం లోటు కారణంగా నాగార్జునసాగర్‌ సహా ప్రధాన జలాశయాలకు వచ్చే నీటి ప్రవాహాలు ప్రభావితమయ్యాయని మంత్రి తెలిపారు. అందుబాటులో ఉన్న నీటిని వివేకంతో వినియోగించడం అత్యంత అవసరమన్నారు.“ఎల్‌నినో అనేది ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపే వాతావరణ పరిస్థితి.అది హుజూర్‌నగర్‌, సూర్యాపేట జిల్లా లేదా తెలంగాణకు మాత్రమే పరిమితమైనది కాదు.విస్తృత వాతావరణ పరిస్థితులను అర్థం చేసుకుని, వాస్తవంగా అందుబాటులో ఉన్న నీటి ఆధారంగా మనం ప్రణాళిక చేసుకోవాలి” అని ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అన్నారు.రాబోయే వారాల్లో భారీ వర్షాలు కురుస్తాయన్న అంచనాలపై పూర్తిగా ఆధారపడకుండా రైతులు పంటలను ఎంచుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.హామీగా లభించే సాగునీటి పరిమాణాన్ని పరిగణనలోకి తీసుకుని పంటల ఎంపిక చేసుకోవాలని సూచించారు.సాగుకు నమ్మకమైన నీరు అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, అదే సమయంలో వేసవి కాలం వరకు, తదుపరి వర్షాకాలం వచ్చే వరకు తాగునీటి అవసరాలకు సరిపడా నీటిని కాపాడాల్సిన బాధ్యత కూడా ఉందని మంత్రి స్పష్టం చేశారు.
53 వేల ఎకరాలకు సాగునీరు:
ఈ నేపథ్యంలో కృష్ణా జలాలపై ఆధారపడిన ప్రాంతాల్లో సాగునీటి భద్రతను పెంచే లక్ష్యంతో చేపట్టిన మహాత్మా గాంధీ ముక్త్యాల బ్రాంచ్‌ కెనాల్‌ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పథకం పనుల పురోగతిని మంత్రి సమీక్షించారు.ఈ పథకం ద్వారా మట్టంపల్లి, మేళ్లచెరువు, చింతలపాలెం మండలాల్లో సుమారు 53 వేల ఎకరాలకు సాగునీరు అందించనున్నారు. ఈ పథకం వల్ల దాదాపు 19,297 కుటుంబాలకు ప్రయోజనం చేకూరనుంది. వీరిలో సుమారు 5,080 గిరిజన కుటుంబాలు,3,540 ఎస్సీ కుటుంబాలు ఉన్నాయి.నాగార్జునసాగర్‌లో నీటి లభ్యత తక్కువగా ఉన్న సమయంలో ప్రత్యామ్నాయ సాగునీటి వనరుగా ఉపయోగపడేలా పులిచింతల బ్యాక్‌వాటర్‌ నుంచి నీటిని ఎత్తిపోసే విధంగా ఈ పథకాన్ని రూపొందించారు.సుమారు 40 కిలోమీటర్ల కాలువల నెట్‌వర్క్‌లో ఇప్పటికే 30 కిలోమీటర్ల పనులు పూర్తయ్యాయి. రెండు పంపులు, మోటార్లు ప్రాజెక్టు ప్రాంతానికి చేరుకోగా, మిగిలిన రెండు సెట్లను సెప్టెంబర్‌ చివరి నాటికి తీసుకురానున్నారు.పంప్‌హౌస్‌, ప్రధాన కాలువ,గేట్‌ రెగ్యులేటర్‌, డెలివరీ సిస్టమ్‌తో పాటు మిగిలిన పనులను వేగవంతం చేసి ప్రధాన భాగాలను డిసెంబర్‌ నాటికి పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.అలాగే ప్రాజెక్టుకు సంబంధించిన ప్రత్యేక 132 కేవీ సబ్‌స్టేషన్‌ పనులను కూడా వెంటనే వేగవంతం చేయాలని సూచించారు.సాగునీటి పథకం సిద్ధమైన తర్వాత విద్యుత్‌ మౌలిక వసతులు అడ్డంకిగా మారకూడదని స్పష్టం చేశారు.ప్రస్తుత వర్షాభావ పరిస్థితులు రెండు అంశాలపై ఏకకాలంలో దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని స్పష్టం చేస్తున్నాయని మంత్రి అన్నారు. ఒకవైపు శాశ్వత సాగునీటి మౌలిక వసతులను వేగంగా పూర్తి చేయడంతో పాటు, ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా, ప్రాధాన్యత క్రమంలో వినియోగించాల్సిన అవసరం ఉందన్నారు.నమ్మకమైన నీటి వనరులు ఉన్న ప్రాంతాల్లో రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని, అయితే కొనసాగుతున్న వర్షాభావ పరిస్థితులు, సెప్టెంబర్‌, అక్టోబర్‌లో వర్షాలు తగ్గే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని పంటల ప్రణాళిక,సాగునీటి విడుదలపై నిర్ణయాలు ఉండాలని ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి స్పష్టం చేశారు.మంత్రి పర్యటన,సమీక్షలో సూర్యాపేట జిల్లా కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవార్‌,ఎస్పీ కె.నరసింహతో పాటు నీటిపారుదల, రెవెన్యూ, విద్యుత్‌ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.