PRAJA SANKSHEMAM NEWS
Newspaper Banner
Date of Publish : 12 September 2026, 4:29 pm Posted by : Praja Sankshemam News

ఆదిలాబాద్ విమానాశ్రయానికి మరో కీలక ముందడుగు: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

మిషన్ మోడ్‌లో పనులు వేగవంతం చేయాలి:కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు విజ్ఞప్తి
ప్రజాసంక్షేమం న్యూస్ హైదరాబాద్:

తెలంగాణ ప్రజలకు,ముఖ్యంగా ఉత్తర తెలంగాణ ప్రాంత ప్రజలకు శుభవార్త.ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న ప్రయత్నాలు,సమావేశాలు,లేఖలు,నిరంతర ఫాలోఅప్‌లకు ఫలితం దక్కే దిశగా మరో కీలక ముందడుగు పడింది. ఆదిలాబాద్ విమానాశ్రయాన్ని రక్షణ, పౌర కార్యకలాపాలకు సంయుక్తంగా వినియోగించే Joint User Airportగా కార్యకలాపాలు ప్రారంభించే ప్రక్రియలో ముఖ్యమైన పురోగతి సాధించింది.ఈ నేపథ్యంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్‌ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కలవగా ఆదిలాబాద్ విమానాశ్రయ ప్రాజెక్టును Mission Modeలో చేపట్టి పనులను వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై కేంద్ర రక్షణ మంత్రి సానుకూలంగా స్పందించి, ప్రాజెక్టుకు తన పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.ప్రాజెక్టు అమలులో కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ, కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, తెలంగాణ ప్రభుత్వం మధ్య సమన్వయాన్ని మరింత వేగవంతం చేసేందుకు ఈ వారాంతంలోగా మూడు విభాగాలు నోడల్ అధికారులను నియమించనున్నాయి.నోడల్ అధికారుల నియామకం అనంతరం ప్రాజెక్టుకు సంబంధించిన మాస్టర్ ప్లాన్,డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (DPR) సిద్ధం చేయడంతో పాటు,పరస్పర సమన్వయంతో పనులను వేగంగా ముందుకు తీసుకెళ్లే చర్యలు చేపట్టనున్నారు.ఆదిలాబాద్ విమానాశ్రయం కార్యకలాపాలు ప్రారంభమైతే ఉత్తర తెలంగాణలో విమాన రవాణా, వాణిజ్యం,పర్యాటకం,పారిశ్రామిక అభివృద్ధికి మరింత ఊతం లభించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లా ప్రజలతో పాటు ఉత్తర తెలంగాణ ప్రాంతానికి ఇది ఎంతో ప్రయోజనకరమైన పరిణామంగా భావిస్తున్నారు.ఈ ప్రాజెక్టుకు నిరంతరం సహకరిస్తున్న కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ రామ్ మోహన్ నాయుడు కింజరాపుకు కూడా కృతజ్ఞతలు తెలిపారు.