ఇప్పటికే హైదరాబాద్ – వరంగల్ జాతీయ రహదారి 163ని పారిశ్రామిక కారిడార్ గా ప్రభుత్వం ప్రకటించింది…
వరంగల్ జిల్లాను పారిశ్రమికంగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన అన్ని వనరులు ఉన్నాయి…
వరంగల్ కు త్వరలోనే ఏయిర్ పోర్ట్ కూడా అందుబాటులోకి రానుంది…
వరంగల్ జిల్లలో కొత్త పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకోవాలి…
ఉమ్మడి వరంగల్ జిల్లా పారిశ్రామిక అభివృద్ధిపై అసెంబ్లీలో మాట్లాడిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి…
ప్రజాసంక్షేమం న్యూస్:
ఉమ్మడి వరంగల్ జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధికి కావాల్సిన అన్ని వనరులు ఉన్నందున కొత్త పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని అసెంబ్లీలో మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు..
తెలంగాణ శాసనసభ సమావేశాలలో భాగంగా ప్యానెల్ స్పీకర్ స్థానంలో ఆసీనులై సభను విజయవంతంగా నిర్వహిస్తున్న స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు వరంగల్ ప్రాంత సమగ్ర పారిశ్రామిక పురోగతిపై అసెంబ్లీలో మాట్లాడారు. గత మూడు రోజులుగా శాసనసభ ప్యానెల్ స్పీకర్గా బాధ్యతలు నిర్వర్తిస్తూ సభా నిర్వహణలో తనదైన అనుభవాన్ని ప్రదర్శిస్తున్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు ఈ రోజు జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో వరంగల్ జిల్లా పారిశ్రామిక ప్రాధాన్యతను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు..
ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు మాట్లాడుతూ…
హైదరాబాద్ – వరంగల్ జాతీయ రహదారి 163 (NH-163) ని ప్రభుత్వం ఇప్పటికే పారిశ్రామిక కారిడార్గా ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపకల్పన చేస్తున్న ‘తెలంగాణ రైసింగ్ – 2047’ విజన్ డాక్యుమెంట్లో వరంగల్ ప్రాంతానికి ప్రత్యేక స్థానం, అత్యున్నత ప్రాధాన్యత కల్పించాలని పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారిని కోరారు.ఒక ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి కావలసిన అన్ని అనుకూలతలు వరంగల్కు ఉన్నాయని కడియం శ్రీహరి సభకు వివరించారు. వరంగల్ జిల్లాను ఆనుకుని గోదావరి నది ప్రవహిస్తుండటంతో పరిశ్రమలకు సరిపడా నీటి లభ్యత ఉందని అలాగే సమృద్ధిగా విద్యుత్ ఉత్పత్తి వనరులు ఉన్నాయని తెలిపారు. దింతో పాటు విస్తారమైన బొగ్గు గనులు, ఐరన్ ఓర్ లభ్యత, ప్రతిష్టాత్మక మెగా టెక్స్టైల్ పార్క్ వరంగల్లో కొలువై ఉందని అన్నారు. వరంగల్ నగరానికి అతిత్వరలోనే ఎయిర్ పోర్ట్ కూడా అందుబాటులోకి రానుండటంతో గ్లోబల్ కనెక్టివిటీ పెరుగుతుందని పేర్కొన్నారు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని, వరంగల్ జిల్లాలో కొత్త పరిశ్రమలు నెలకొల్పేలా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి, బహుళజాతి కంపెనీలను ఆకర్షించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు లేవనెత్తిన అంశాలపై రాష్ట్ర శాసనసభా వ్యవహారాలు, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు నేరుగా స్పందించారు. హైదరాబాద్ – వరంగల్ జాతీయ రహదారిని పూర్తిస్థాయి పారిశ్రామిక కారిడార్గా అభివృద్ధి చేయడానికి కావలసిన అన్ని రకాల సహాయ సహకారాలు, అవసరమైన చర్యలను ప్రభుత్వం త్వరలోనే వేగవంతంగా చేపడుతుందని సభముఖంగా హామీ ఇచ్చారు.సభాధ్యక్షుడిగా బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తూనే, ఉమ్మడి వరంగల్ జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు అసెంబ్లీ వేదికగా చూపిన చొరవ ఆయనకు ఉన్న సుదీర్ఘ రాజకీయ పరిజ్ఞానానికి, పరిపాలన అనుభవానికి నిదర్శనంగా నిలుస్తుంది..