Saturday, August 22, 2026
prajasamkshemam news
Homeతెలంగాణపేద విద్యార్థుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం!ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

పేద విద్యార్థుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం!ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

📰 Generate e-Paper Clip

గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్య, మెరుగైన వసతులు కల్పిస్తాం:రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
ప్రజా సంక్షేమం న్యూస్
పేద, గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతులు కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ, మారుమూల గిరిజన ప్రాంతాల విద్యార్థుల అభ్యున్నతికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని తెలిపారు.శనివారం మంత్రి ఉట్నూరు బాలికల ఆశ్రమ పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఐటీడీఏ పీవో మంద మకరందు, ఎస్పీ అఖిల్ మహాజన్ పూల మొక్కలు అందించి మంత్రికి ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.
ఆశ్రమ పాఠశాలలో ఏర్పాటు చేసిన ఐఎఫ్ ప్యానెల్‌ను మంత్రి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ప్యానెల్ ఏర్పాటుకు సంబంధించిన వివరాలను అధికారులు మంత్రికి వివరించారు. అనంతరం పాఠశాలలో ఏర్పాటు చేసిన దుస్తుల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పేద, గిరిజన విద్యార్థులు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా విద్యను కొనసాగించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. ఐటీడీఏ పరిధిలోని పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన యూనిఫాంలు, షూస్, పుస్తకాలు, ఇతర అవసరమైన సౌకర్యాలు అందించడం ప్రభుత్వ బాధ్యతగా భావిస్తున్నామని చెప్పారు.ఆశ్రమ, గురుకుల పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. విద్యార్థులు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు. ఉపాధ్యాయులు విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మరింత అంకితభావంతో పనిచేయాలని సూచించారు.ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. ఆశ్రమ పాఠశాలల్లో సీఆర్‌టీ సిబ్బంది సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.గిరిజన ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, విద్య, వైద్యం, మౌలిక వసతులు, సంక్షేమ రంగాలను మరింత బలోపేతం చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. గిరిజన ప్రాంతాల్లో విద్యతో పాటు విద్యార్థుల ఆరోగ్యం, పోషకాహారం, శారీరక దారుఢ్యంపై కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందన్నారు. ఆశ్రమ, రెసిడెన్షియల్ పాఠశాలల్లో డిజిటల్ తరగతి గదులు, జూంబా, ఏరోబిక్స్ వంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు.
న్నత స్థానాలకు ఎదగాలి: ఎమ్మెల్సీ దండే విఠల్
ఎమ్మెల్సీ దండే విఠల్ మాట్లాడుతూ, పేద, గిరిజన, వెనుకబడిన వర్గాల విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించి కలెక్టర్లు, ఇంజనీర్లు, వైద్యులు, ఐఏఎస్‌, ఐపీఎస్‌ వంటి ఉన్నత స్థానాలకు ఎదగాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.విద్యార్థుల ముఖాల్లో చిరునవ్వులు చూడాలనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్టడీ సర్కిల్, గిరిజన స్టడీ సర్కిల్ ద్వారా విద్యార్థులకు పోటీ పరీక్షలకు అవసరమైన శిక్షణ అందిస్తూ అనేక మంది ఉన్నత స్థాయి ఉద్యోగాలకు ఎంపికవుతున్నారని చెప్పారు. విద్యార్థులకు ఉన్నత చదువులు, పోటీ పరీక్షల కోసం ప్రత్యేక కోచింగ్ సదుపాయాలను మరింత విస్తరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. విద్యార్థులు కష్టపడి చదివి తల్లిదండ్రులకు, తమ ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
పాఠశాలల అభివృద్ధికి సమన్వయంతో పనిచేయాలి: ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
స్థానిక ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంక్షేమం, నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. పాఠశాలల అభివృద్ధికి ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉపాధ్యాయులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.ప్రభుత్వం కల్పిస్తున్న డిజిటల్ బోర్డులు, సైన్స్ ల్యాబ్‌లు, ఇతర ఆధునిక సౌకర్యాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పూర్వ విద్యార్థులు, గ్రామస్తులు పాఠశాలల అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ఆశ్రమ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల పెంపునకు చర్యలు: జిల్లా కలెక్టర్ రాజర్షి షా
జిల్లా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ, ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతులు కల్పించేందుకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపడుతోందని తెలిపారు.ఆశ్రమ పాఠశాలలు, గురుకులాల్లో విద్యార్థులు ఇటీవలి కాలంలో మంచి ఫలితాలు సాధిస్తున్నారని చెప్పారు. ఈ విద్యా సంవత్సరం నుంచి ఆశ్రమ పాఠశాలల్లో ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ (FLN) కార్యక్రమాన్ని ప్రత్యేకంగా అమలు చేస్తున్నామని తెలిపారు. విద్యార్థుల్లో ప్రాథమిక అక్షరాస్యత, సంఖ్యా సామర్థ్యాలను పెంపొందించేందుకు ఉపాధ్యాయులకు క్రమం తప్పకుండా శిక్షణ, నెలవారీ సమీక్షలు నిర్వహిస్తున్నామని వివరించారు.విద్యార్థుల పోషకాహార స్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, ఉమ్మడి జిల్లా ఐటీడీఏ పరిధిలోని 400కు పైగా గిరిజన సంక్షేమ ప్రాథమిక పాఠశాలల్లో సుమారు రూ.20 కోట్లతో మరమ్మతు పనులు చేపట్టినట్లు కలెక్టర్ తెలిపారు.
ఆశ్రమ పాఠశాలల్లో సీఆర్‌టీ సిబ్బంది కొరత, అత్యవసర ఆరోగ్య సమస్యలు, ఇతర సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఉట్నూరు ఐటీడీఏ ఆధ్వర్యంలో దివ్యాంగ విద్యార్థుల కోసం నిర్వహిస్తున్న ‘వికాసం స్కూల్’ ను మరింత బలోపేతం చేసేందుకు అవసరమైన సహకారం అందిస్తామని తెలిపారు.విద్యార్థులకు నాణ్యమైన విద్య, మెరుగైన వసతులు, ఆరోగ్యం, పోషకాహారం అందించి వారి సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం సమన్వయంతో పనిచేస్తున్నాయని కలెక్టర్ స్పష్టం చేశారు.అనంతరం మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఇతర అధికారులు విద్యార్థినులకు ఏకరూప దుస్తులు, కిట్లను పంపిణీ చేశారు.అనంతరం విద్యార్థులతో కలిసి మంత్రి, కమిషనర్, జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే, తదితరులు సహాపంక్తి భోజనం చేశారు.ఈ కార్యక్రమంలో ట్రైబల్ వెల్ఫేర్ కమిషనర్ సంతోష్, ఎస్‌ఈటిడబ్ల్యూ ఫణికుమారి, అదనపు కలెక్టర్ రాజేశ్వర్, ఏఎస్పీ రుత్విక్ సాయి కోటే, ఆర్డీఓ మోహన్ సింగ్, డి. ప్రేమకళ, డీటీడీఓలు అంబాజీ, నిహారిక, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, సర్పంచ్ అనిత జాదవ్, ప్రజాప్రతినిధులు, అధికారులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.