రూ. 14 వేల కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి
భువనగిరి (ప్రజా సంక్షేమం న్యూస్):
తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న రూ. 14 వేల కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ, BC SC ST-JAC మరియు DSP(ధర్మ సమాజ్ పార్టీ) సంయుక్త ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేశారు.BC SC ST-JAC మరియు DSP జిల్లా అధ్యక్షులు ఎర్రోళ్ల శాంతి కుమార్ గారి ఆధ్వర్యంలో సోమవారం (31-08-2026) ఈ వినతిపత్ర సమర్పణ కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా BC SC ST-JAC రాష్ట్ర ఉపాధ్యక్షులు రాసాల వినోద్ యాదవ్ గారు మాట్లాడుతూ..రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 30 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన రూ.14వేల కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ప్రభుత్వం వద్ద నిలిచిపోవడం శోచనీయమని అన్నారు. సమయానికి ఫీజులు చెల్లించలేక ముఖ్యంగా బీసీ,ఎస్సీ,ఎస్టీ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఫీజుల బకాయిల వల్ల కళాశాలల్లో చదువులు మధ్యలోనే ఆగిపోతున్నాయని, మనస్తాపంతో కొందరు విద్యార్థులు ఆత్మహత్యలకు సైతం పాల్పడుతున్నారని తెలిపారు. ఈ బకాయిల ప్రభావం రాష్ట్రంలో సుమారు ఒక కోటి కుటుంబాలపై పడిందని పేర్కొన్నారు.విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం తక్షణమే స్పందించి పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని, బీసీ ఎస్సీ ఎస్టీ పేద విద్యార్థులు ఎటువంటి ఆటంకం లేకుండా తమ విద్యాభ్యాసాన్ని కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో BC SC ST-JAC మరియు DSP జిల్లా ఉపాధ్యక్షులు K.లింగస్వామి,జలంధర్,జిల్లా ప్రధాన కార్యదర్శి V.శ్రీకాంత్,కార్యదర్శులు B.R. సాయి కుమార్, A.సురేష్,K.సాయికిరణ్, వెంకటేష్, చెక్క సాయి కుమార్,K.గణేష్ తదితరులు పాల్గొన్నారు.

