రూ.30 వేల కోట్లతో రోడ్డు అభివృద్ధి పనులు..
పారిశ్రామిక, వ్యాపార రంగాలకు ఊతం: మంత్రి
ప్రజా సంక్షేమం న్యూస్-పెద్దపల్లి,ఆగస్టు 19:తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో రహదారి మౌలిక వసతుల అభివృద్ధికి భారీగా నిధులు కేటాయిస్తూ ముందుకు సాగుతోందని రోడ్లు, భవనాలు,సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపారు.మెరుగైన రహదారి వ్యవస్థతో పారిశ్రామిక, వ్యాపార కార్యకలాపాలు విస్తరించి స్థానిక యువతకు మరిన్ని ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు.
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గరేపల్లిలో బుధవారం రూ.219.67 కోట్ల విలువైన హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (HAM),నాన్-ప్లాన్ రోడ్డు అభివృద్ధి పనులకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి శంకుస్థాపన చేశారు.ఈ కార్యక్రమంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు,ఐటీ–పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు,ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణారావు,జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్ తదితరులు పాల్గొన్నారు.
రూ.30 వేల కోట్లతో రోడ్డు పనులు:
రాష్ట్రవ్యాప్తంగా రోడ్లు, భవనాల శాఖ ఆధ్వర్యంలో సుమారు రూ.13,000 కోట్లతో, పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో మరో రూ.17,000 కోట్లతో రహదారి అభివృద్ధి పనులు చేపడుతున్నామని మంత్రి తెలిపారు.దేశంలోని మరే రాష్ట్రంలోనూ ఇంత పెద్ద స్థాయిలో రోడ్డు పనులు చేపట్టడం లేదని ఆయన పేర్కొన్నారు. HAM విధానంలో ప్రాజెక్టు వ్యయంలో 40 శాతం ప్రభుత్వమే భరిస్తుందని, మిగిలిన 60 శాతం కాంట్రాక్టర్ భరించాల్సి ఉంటుందని వివరించారు.
రెండేళ్లలో పనులు పూర్తి:
బుధవారం శంకుస్థాపన చేసిన రహదారి పనులను రెండేళ్లలో పూర్తి చేయనున్నట్లు కోమటిరెడ్డి తెలిపారు. వారం రోజుల్లోనే క్షేత్రస్థాయిలో పనులు ప్రారంభమవుతాయని చెప్పారు.రోడ్డు ప్రమాదాల నివారణకు వాహనదారులు, ప్రజలు రహదారి భద్రతా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని మంత్రి సూచించారు.అప్రమత్తంగా ప్రయాణించి ప్రమాదాలను నివారించాలని కోరారు.
హైదరాబాద్–రామగుండం గ్రీన్ఫీల్డ్ రోడ్డు:
గత ప్రభుత్వం సుమారు రూ.40 వేల కోట్ల పెండింగ్ బిల్లులను మిగిల్చిందని కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్ నుంచి రామగుండం వరకు కొత్త గ్రీన్ఫీల్డ్ రహదారి నిర్మాణంపై కేంద్ర మంత్రితో చర్చలు జరిపినట్లు తెలిపారు.ప్రతిపాదిత గ్రీన్ఫీల్డ్ రహదారిలో సుల్తానాబాద్ బైపాస్ను కూడా చేర్చి అనుమతులు పొందేందుకు ప్రయత్నాలు చేస్తామని మంత్రి వెల్లడించారు.
చిన్న కాళేశ్వరం ప్రాజెక్టుకు పునరుజ్జీవనం:
నీటిపారుదల అంశంపై మాట్లాడిన మంత్రి, గత బీఆర్ఎస్ ప్రభుత్వం చిన్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు.ప్రస్తుత ప్రభుత్వం శ్రీపాద ఎల్లంపల్లి రిజర్వాయర్ నుంచి నీటిని ఎత్తిపోసి స్థానికంగా సాగుకు మద్దతు అందించే చర్యలను పునరుద్ధరించిందని తెలిపారు.నెహ్రూ హయాంలో నిర్మించిన ప్రాజెక్టుల ప్రస్తావనమాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ హయాంలో నిర్మించిన పలు సాగునీటి ప్రాజెక్టులు ఇప్పటికీ సురక్షితంగా కొనసాగుతూ లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నాయని కోమటిరెడ్డి పేర్కొన్నారు.పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావును మంత్రి అభినందించారు. జిల్లా అభివృద్ధికి కట్టుబడి పనిచేసే నాయకుడిని ప్రజలు ఎన్నుకున్నారని ప్రశంసించారు.పెద్దపల్లి బైపాస్ పనులు కొనసాగుతున్నాయికాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెలలోనే పెద్దపల్లి బైపాస్ రహదారికి నిధులు మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు. ప్రస్తుతం బైపాస్ రహదారి పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు.

