Saturday, September 12, 2026
prajasamkshemam news
Homeఅంతర్జాతీయంపేదల సొంతింటి కలను సాకారం చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్...

పేదల సొంతింటి కలను సాకారం చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి

📰 Generate e-Paper Clip

పేద ప్రజల సొంతింటి కల నెరవేర్చడమే తమ ప్రజా ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని భువనగిరి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు స్పష్టం చేశారు.
ప్రజా సంక్షేమం న్యూస్, భువనగిరి ఆగస్టు 31:
సోమవారం భువనగిరి పట్టణ పరిధిలోని సింగన్నగూడెం వద్ద నిర్మించిన 444 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల సముదాయంలో నూతనంగా సిద్ధం చేసిన 120 ఇళ్లను లబ్ధిదారులకు ఎమ్మెల్యే గారు హస్తగతం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సామూహిక గృహ ప్రవేశ కార్యక్రమాన్ని ప్రారంభించి, లబ్ధిదారులతో కలిసి వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం లబ్ధిదారులతో కలిసి నూతన గృహాల్లోకి గృహప్రవేశం చేశారు.
గత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు మాట్లాడారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పేరుతో పేద ప్రజలను ఏళ్ల తరబడి మోసం చేసి, ఎదురుచూపులకే పరిమితం చేసిందని దుయ్యబట్టారు. ఇళ్ల నిర్మాణాలు చేపట్టినా వాటిని పూర్తి చేయడంలో, అర్హులైన పేదలకు అందించడంలో గత పాలకులు పూర్తిగా విఫలమయ్యారని, కేవలం ప్రచారానికే ప్రాధాన్యతనిచ్చి ఆచరణను విస్మరించారని విమర్శించారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నిలిచిపోయిన నిర్మాణ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి, అర్హులకు పారదర్శకంగా అందిస్తున్నామని తెలిపారు.
నియోజకవర్గ సంక్షేమ, అభివృద్ధి సమాచారం:
ఇళ్ల కేటాయింపులు: నియోజకవర్గంలో ఇప్పటికే 3,500 ఇళ్లను మంజూరు చేయగా, అందులో 1,600 ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేశామని, త్వరలోనే మరో 2,000 కొత్త ఇళ్లను కేటాయించబోతున్నామని వెల్లడించారు.
అభివృద్ధి పనులు: రూ.1,500 కోట్ల నిధులతో భువనగిరి నియోజకవర్గంలో రికార్డు స్థాయిలో వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.
సాగు, తాగునీరు: నియోజకవర్గంలోని సాగునీరు, తాగునీటి కాలువల నిర్మాణ పనులను త్వరలోనే పూర్తి చేసి ప్రజలకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారు.
రాజకీయాలకతీతంగా సంక్షేమం: పార్టీలు, రాజకీయాలతో సంబంధం లేకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని, రాజకీయాలకు అతీతంగా అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్నామని పేర్కొన్నారు.
“ఆఖరి మెట్టు ఎక్కితేనే విజయం లభిస్తుంది. ప్రారంభించిన ప్రతి పనిని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే మా లక్ష్యం. పేదల సంక్షేమం, భువనగిరి అభివృద్ధి విషయంలో ఎక్కడా రాజీ పడే ప్రసక్తే లేదు” అని ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి గారు కుండబద్దలు కొట్టారు.
అంగరంగ వైభవంగా జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు:
ఈ కార్యక్రమంలో భువనగిరి మున్సిపల్ చైర్‌పర్సన్ తంగళ్లపల్లి శ్రీవాణి-రవికుమార్, అడిషనల్ కలెక్టర్ భాస్కరరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అవేస్ చిస్తి, హౌసింగ్ పీడీ చంద్రకళ, మున్సిపల్ కమిషనర్ చంద్రప్రకాష్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు కూర వెంకటేష్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మున్సిపల్ కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, వివిధ శాఖల అధికారులు మరియు ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.