* పెద్ద కుమార్తెను బస్సు ఎక్కించేందుకు వచ్చి.. చిన్న కుమార్తెను కోల్పోయిన తండ్రి
* డ్రైవర్ నిర్లక్ష్యంతో చిన్నారిపై నుంచి వెళ్లిన బస్సు చక్రాలు – అక్కడికక్కడే మృతి
* కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన రామన్నపేట పోలీసులు
ప్రజా సంక్షేమం న్యూస్-రామన్నపేట:
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం తుమ్మలగూడెం (ఇంద్రపాలనగరం) గ్రామంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. బస్సు డ్రైవర్ అజాగ్రత్త, నిర్లక్ష్యంగా వాహనం నడపడంతో కేవలం 21 నెలల పసికందు ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..శనివారం ఉదయం సుమారు 7:30 గంటల సమయంలో తుమ్మలగూడెం గ్రామానికి చెందిన ఈర్లపల్లి మురళి తన పెద్ద కుమార్తె ఈర్లపల్లి శ్రేష్ఠజ్ఞ మాన్సినిని బస్సు ఎక్కించేందుకు ప్రధాన రహదారి వద్దకు తీసుకువచ్చారు. అదే సమయంలో ఆయన 21 నెలల చిన్న కుమార్తె ఈర్లపల్లి అభిజ్ఞతార కూడా బస్సు సమీపానికి వచ్చింది.ఆ సమయంలో బస్సు డ్రైవర్ అత్యంత నిర్లక్ష్యంగా, అజాగ్రత్తగా వాహనాన్ని ముందుకు కదిలించడంతో చిన్నారిని బలంగా ఢీకొట్టింది. అనంతరం బస్సు చక్రాలు చిన్నారిపై నుంచి వెళ్లడంతో తీవ్ర గాయాల పాలై పసికందు అక్కడికక్కడే మృతి చెందింది. కళ్లముందే కుమార్తె విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించిన తీరు గ్రామస్తులను కంటతడి పెట్టించింది.
ఘటనపై చిన్నారి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రామన్నపేట ఎస్సై సతీష్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
‘ప్రజా సంక్షేమం’న్యూస్ రిపోర్ట్: దోమలపల్లి గోపి(నల్లగొండ జిల్లా ప్రతినిధి) | 9248307393

