
మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా: దమ్మాయిగూడలోని శ్రీచైతన్య హైస్కూల్లో పదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థిపై తోటి విద్యార్థులు దారుణంగా దాడి చేసిన ఘటన కలకలం రేపింది. కామారెడ్డికి చెందిన అభిషేక్ అనే విద్యార్థిపై హాస్టల్లో రాత్రి సమయంలో సుమారు 12 మంది విద్యార్థులు దాడి చేసినట్లు అతని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
తల్లిదండ్రుల వివరాల ప్రకారం.. రాత్రి సమయంలో హాస్టల్లో అభిషేక్ను కర్రలు, ప్లేట్లతో కొట్టడంతో పాటు బూట్లతో ముఖంపై తొక్కి తీవ్రంగా గాయపరిచినట్లు తెలుస్తోంది. దాడిలో విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి.
అయితే తమ కుమారుడు మెట్లపై నుంచి కిందపడిపోయాడని స్కూల్ యాజమాన్యం ఫోన్ ద్వారా తమకు సమాచారం ఇచ్చిందని తల్లిదండ్రులు తెలిపారు. వెంటనే పాఠశాలకు చేరుకుని అభిషేక్ను ఇంటికి తీసుకువచ్చామని చెప్పారు. ప్రస్తుతం బాలుడి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
తనపై ర్యాగింగ్ పేరుతో సీనియర్ విద్యార్థులు దాడి చేశారని అభిషేక్ తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.
తమ కుమారుడిపై దాడి చేసిన విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఘటనను బయటకు రాకుండా దాచేందుకు ప్రయత్నించిన స్కూల్ యాజమాన్యంపై కూడా చర్యలు తీసుకోవాలని బాలుడి తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.
ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టి, దాడికి గల కారణాలు, ఘటనలో ఎంతమంది విద్యార్థులు పాల్గొన్నారు, పాఠశాల యాజమాన్యం వ్యవహరించిన తీరుపై వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం.
విద్యార్థుల భద్రతపై తల్లిదండ్రుల్లో ఆందోళన
హాస్టళ్లలో విద్యార్థుల భద్రతకు సంబంధించి పాఠశాల యాజమాన్యాలు మరింత బాధ్యతగా వ్యవహరించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. ర్యాగింగ్, వేధింపులు లేదా విద్యార్థులపై దాడులు జరిగితే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

