Sunday, August 23, 2026
prajasamkshemam news
Homeతెలంగాణషెడ్యూల్డ్ కులాలు,తెగల పథకాలు పకడ్బందీగా అమలు చేయాలి:ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య

షెడ్యూల్డ్ కులాలు,తెగల పథకాలు పకడ్బందీగా అమలు చేయాలి:ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య

📰 Generate e-Paper Clip


సబ్ ప్లాన్ నిధులు దారిమళ్లిస్తే కఠిన చర్యలు!
​నల్గొండ సమీక్షలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య హెచ్చరిక!
ఆర్ఓఆర్, అట్రాసిటీ కేసుల పరిష్కారానికి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు!

ప్రజా సంక్షేమం న్యూస్
షెడ్యూల్డ్ కులాలు, తెగల వారి అభివృద్ధి కి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు పథకాలు పకడ్బందీగా అమలు కావాలని రాష్ట్ర షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు.బుధవారం ఆయన కమిషన్ సభ్యులతో కలిసి నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలోని ఉదయాదీత్య భవన్లో జిల్లాలోని ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన భూముల సమస్యలు, దాడుల కేసులు,ఉద్యోగాలలో ఎస్సీ, ఎస్టీ రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు, తదితర అంశాలపై అధికారులతో సమీక్షించారు. వివిధ అంశాలపై సమీక్ష సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సి ల కై వివిధ శాఖల ద్వారా అమలు చేస్తున్న సబ్ ప్లాన్ నిధులు పక్కాగా వినియోగించాలని,దారి మళ్లించవద్దని, ఒకవేళ దారి మళ్ళి ఇస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు. ఎస్సీ, ఎస్టీ ఆవాసాలలో చేపట్టేందుకు మంజూరైన పనులు ఇతర పనులకు మళ్లించకూడదన్నారు. ఎక్కడైనా సబ్ ప్లాన్ నిధులు మిగిలిపోతే తిరిగి ఎస్సీ, ఎస్టీ కాలనీలలో రోడ్లు, ఇతర పనులు చేపట్టాలన్నారు. ఉద్యోగాలు, ప్రమోషన్లలో ఎస్సీ, ఎస్టీలకు తప్పనిసరిగా ఆర్ఓఆర్ అమలు చేయాలని, ఈ విషయంలో అన్యాయం జరిగితే కమిషన్ ఊరుకోదని హెచ్చరించారు. ఎంపీ నిధులు నియోజకవర్గ అభివృద్ధి నిధులు, ఎస్ డి ఎఫ్ నిధులను రిజర్వేషన్ ప్రకారం కేటించాలన్నారు. మిర్యాలగూడ డివిజన్లో శూన్యపహాడ్, గణేష్ పహాడ్ రోడ్డు వ్యవహారాన్ని సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ తో కోరారు. జిల్లాలో ఎస్సీ, ఎస్టీల పై దాడులకు సంబంధించి కోర్టు కేసులు జాప్యం లేకుండా పరిష్కరించాలని, శిక్షల శాతాన్ని పెంచాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ ను ఆదేశించారు. మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీలలో ఎక్కువమంది ఎస్సీ, ఎస్టీలే పనిచేస్తున్నందున పారిశుధ్య కార్మికులకు తప్పనిసరిగా ఇన్సూరెన్స్ అమలు చేయాలన్నారు. మహాత్మా గాంధీ యూనివర్సిటీలో ఔట్సోర్సింగ్ ఉద్యోగుల నియామకంపై తక్షణమే విచారణ నిర్వహించి కమిషన్ కు నివేదిక పంపాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు. చండూరు మండలం అంగడిపేటకు చెందిన ఎస్సీ మహిళ మేకల బుచ్చమ్మ ఇంటి వివాదం కేసును విచారించి పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు.

–ఎస్సీ,ఎస్టీ దాడుల బాధితులకు పరిహారాన్ని త్వరగా తెప్పించేందుకు ప్రయత్నిస్తా!
అనంతరం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ జిల్లాలో ఎస్సీ, ఎస్టీ దాడుల కేసుల్లో బాధితులకు అందించాల్సిన కోటి 89 లక్షల రూపాయల పరిహారాన్ని సాధ్యమైనంత త్వరగా తెప్పించేందుకు ప్రయత్నిస్తామని, అలాగే కులాంతర వివాహాలు చేసుకున్న వారికి, బెస్ట్ అవైలబుల్ పాఠశాలలకు నిధులు తెప్పించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఆదివారం రాష్ట్ర ముఖ్యమంత్రితో నిర్వహించనున్న హై పవర్ కమిటీలో వీటన్నిటిపై సమీక్షించి నిధులు మంజూరు చేయమని కోరనున్నట్లు వెల్లడించారు. జిల్లాలోని గుడితాండ పునరావాస కేంద్రానికి సంబంధించి 130 మందికి పరిహారం రాని విషయంలో సమగ్ర విచారణ నిర్వహించి వారికి న్యాయం జరిగేలా చూడాలని కలెక్టర్ ను ఆదేశించారు. నల్గొండ జిల్లా కేంద్రం బై పాస్ వద్ద డాక్టర్ బి అర్. అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాలను రోడ్డు నుండి తొలగించకుండా కమిటీ వేసి విచారణ నిర్వహించాలని నిర్ణయం తీసుకోవాలన్నారు. షెడ్యూల్డ్ కులాలు,తెగల వారిపై జరిగిన దాడులు, హత్యలు, అత్యాచార కేసుల్లో ఉచితంగా న్యాయ సహాయం అందిస్తున్న అడ్వకేట్ దర్శనం నరసింహ కు గన్ మెన్ ను పునరుద్ధరించాలని జిల్లా ఎస్పీని కోరారు. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగాలలో రిజర్వేషన్ పాటించాలని, ప్రమోషన్లలో ఎవరికి అన్యాయం జరగకుండా చూడాలని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీలకు రాష్ట్ర ముఖ్యమంత్రి వెయ్యి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చారని ,మరో వెయ్యి ఇండ్లు ఇస్తామని తెలియజేశారని వెల్లడించారు. రాష్ట్రంలోని బెస్ట్ అవైలబుల్ పాఠశాలలకు నిధులు కేటాయించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రిని కోరనున్నట్లు ఆయన వెల్లడించారు.
—మహాత్ముల విగ్రహాలనుతొలగించొద్దు..రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యులు జిల్లా శంకర్ మాట్లాడుతూ జిల్లాలో ఎస్సీ, ఎస్టీ ల పై దాడుల కేసుల పరిష్కారం, డ్రగ్స్ అరికట్టడంలో పోలీసు, రెవెన్యూ శాఖలు చేస్తున్న కృషిని ప్రశంసించారు. నల్గొండ బైపాస్ లో ఉన్న మహాత్ముల విగ్రహాలను అక్కడినుండి కదిలించవద్దని, ఎస్సీ, ఎస్టీల పై దాడుల కేసులకు సంబంధించిన అడ్వకేట్ దర్శనం నరసింహ కు గన్మెన్ రక్షణ కల్పించాలని, మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం అవుట్సోర్సింగ్ ఉద్యోగాల నియామకానికి సంబంధించిన అంశంపై విచారణ నిర్వహించి నివేదిక సమర్పించాలని, ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేకంగా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని, ఎస్సీ, ఎస్టీ కేసులో తక్షణమే ఎఫ్ఐఆర్ నమోదు అయ్యేలా చేయాలని, శూన్య పహాడ్, గణేష్ పహాడ్ రోడ్డుకు సంబంధించిన సమస్యను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని, కులాంతర వివాహాలు చేసుకున్న వారికి ప్రోత్సాహక మొత్తాన్ని ఇప్పించడంలో చొరవ తీసుకోవాలని కోరారు. మరో సభ్యులు రాంబాబు నాయక్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీలకు న్యాయం చేకూర్చేందుకు రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ రాష్ట్రంలోని అన్ని జిల్లాలను పర్యటిస్తున్నదని, ఎస్సీ, ఎస్టీల సంక్షేమం, అభివృద్ధి కి ఇతర రాష్ట్రాలలో సైతం ఎస్సీ, ఎస్టీలపై అధ్యయనం చేయడం జరిగిందని, నల్గొండ జిల్లాలో గతంలో కంటే కేసుల పరిష్కారం ఎంతో మెరుగ్గా ఉందని, ఎస్సీ, ఎస్టీల భూముల విషయంలో అగ్రవర్ణాల ఆధిపత్యానికి అరికట్టే చర్యలు తీసుకోవాలని, గుడితాండా ఆర్ అండ్ ఆర్ లో తండ్రులకు నష్టపరిహారం రాగా, కొడుకులకు ప్యాకేజీ రాలేదని, ఈ విషయంపై ప్రత్యేకంగా విచారణ నిర్వహించి అందరికీ న్యాయం జరిగేలా చూడాలని కోరారు.
జిల్లాలో పగడ్బందీగా చట్టం అమలు:కలెక్టర్ బి. చంద్రశేఖర్
సమావేశం ప్రారంభమైన వెంటనే జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ మాట్లాడుతూ జిల్లాలో షెడ్యూల్డ్ కులాలు, తెగల వారి పై దాడులకు సంబంధించి చట్టాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నామని, ఇందులో భాగంగా జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేసి రెండుసార్లు సమావేశాలు నిర్వహించామని, రెవిన్యూ, పోలీస్ తరఫున ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎస్సీ, ఎస్టీల కేసులను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామని, ప్రతి నెల క్రమం తప్పకుండా పౌర హక్కుల దినోత్సవం నిర్వహిస్తున్నామని, ఎస్సీ, ఎస్టీల ప్రజల హక్కులు కాపాడడంలో వారి ఇబ్బందులను తీర్చేందుకు శాయ శక్తుల కృషి చేస్తున్నామని, డివిజన్, మండల స్థాయిలలో కూడా అధికారులు ఎస్సీ, ఎస్టీ ల అభివృద్ధికి కృషి చేస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అర్హులైన లబ్ధిదారులకు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.
సంవత్సరానికి 100 కేసులు:ఎస్పీ శరత్చంద్ర పవర్.
జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవర్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి, సంక్షేమంలో భాగంగా నల్గొండ జిల్లాలో జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ ఏర్పాటుతోపాటు, నిరంతర సమీక్షలు, దాడులలో బాధితులకు నష్టపరిహారం ఇప్పించడం, క్రమం తప్పకుండా పౌర హక్కుల దినం నిర్వహించడం చేస్తున్నామని, ప్రతి సంవత్సరం జిల్లాలో 90 నుండి 100 వరకు ఎస్సీ, ఎస్టీలపై దాడుల కేసులు నమోదు అవుతున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం జిల్లాలో 54 కేసులు విచారణలో ఉండగా, ఇప్పటివరకు 6 కేసుల్లో కోర్టుల ద్వారా శిక్షణ కూడా విధించడం జరిగిందని వెల్లడించారు.
బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయండి:విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు
జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు సంకు ధనలక్ష్మి, బెజ్జం సైదులు, మరో సభ్యులు అనిత, భీమనపల్లి సైదులు, భాస్కర్ తదితరులు మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీల కింద సబ్ ప్లాన్ కింద లోన్లు ఇప్పించాలని, బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయాలని, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖల అవుట్సోర్సింగ్ ఎంప్లాయిస్ లో ఏజెన్సీ ద్వారా కాకుండా నేరుగా ఉద్యోగులను నియమించాలని, ఎస్సీలు కేసులు పెట్టినప్పుడు త్వరిత గతిన పరిష్కరించాలని, ఆర్ ఓ ఆర్ తప్పనిసరిగా పాటించేలా చూడాలని, ఎస్సీ, ఎస్టీ వాడల్లో టాయిలెట్స్ నిర్మించాలని, ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేకంగా ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాలని, ఎస్సి వాడల్లో సిసి రోడ్లు, డ్రైన్లు వేయించాలని, ఎస్సీ కాలనీలలో సారా అరికట్టాలని, గ్రామాలలో చట్టాలపై అవగాహన కల్పించాలని, అంగడిపేట మేకల బుచ్చమ్మ కేసును త్వరితగతిన పరిష్కరించాలని, అలాగే కేసులను పరిష్కరించాలని కోరారు. పలు సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ ఎస్ సి,ఎస్ టి ల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని కోరారు.
రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యులు కే. లక్ష్మీనారాయణ, కలెక్టర్ జె. శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ ప్రేమకరణ్ రెడ్డి, శిక్షణ సహాయ కలెక్టర్ శ్రీకాంత్ రెడ్డి ,సాంఘిక సంక్షేమ శాఖ డిడి శశికళ, డిటిడిఓ కమలాకర్ రెడ్డి, డి.ఎఫ్.ఓ రాజశేఖర్, డిఆర్ఓ దశరథ్, ఆర్డీవోలు, డిఎస్పీలు, పాల్గొన్నారు. అంతకుముందు జిల్లాలో ఎస్సీ, ఎస్టీల సమీక్ష కోసం జిల్లా చేరుకున్న రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య సభ్యులకు జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ పుష్పగుచ్చలను అందజేసి ఘన స్వాగతం పలికారు…

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.