Saturday, August 22, 2026
prajasamkshemam news
Homeఆంధ్రప్రదేశ్ఇన్సూరెన్స్ ఉంటేనే పెట్రోల్-కొత్త రూల్స్ ఇవే..

ఇన్సూరెన్స్ ఉంటేనే పెట్రోల్-కొత్త రూల్స్ ఇవే..

📰 Generate e-Paper Clip

దేశవ్యాప్తంగా జాతీయ రహదారులతో పాటు రాష్ట్ర రహదారులపైనా పెరిగిపోతున్న ప్రమాదాలకు చెక్ పెట్టేందుకు సుప్రీంకోర్టు ఇవాళ ఓ ప్రతిపాదన చేసింది. రోడ్డు భద్రతను పటిష్టం చేయడంతో పాటు నిబంధనల్ని పాటించేలా వాహనదారులపై ఒత్తిడి పెంచేందుకు కీలక ప్రతిపాదన చేసింది. ఇకపై వాహనాలకు ఇన్సూరెన్స్ ఉంటేనే వాటికి పెట్రోల్ బంకుల్లో పెట్రోల్, డీజిల్ పోసేలా చట్టంలో మార్పులు చేయాలని కేంద్రానికి ప్రతిపాదించింది.
రోడ్లపై 56 శాతం ఇన్సూరెన్స్ లేకుండా వాహనాలు తిరుగుతున్నట్లు గుర్తించిన సుప్రీంకోర్టు.. వాటిని పెట్రోల్, డీజిల్ సరఫరాతో లింక్ చేసేలా ఓ కొత్త పైలట్ ప్రాజెక్టును ప్రతిపాదించింది. ఇన్సూరెన్స్ లేకపోవడం వల్ల వాహనాల బీమా యొక్క అసలు ఉద్దేశ్యాన్నే దెబ్బతీస్తుందని, ప్రమాద బాధితులు, వారి కుటుంబాలు నష్టపరిహారం కోసం సంవత్సరాల తరబడి ఎదురుచూసేలా చేస్తుందని కోర్టు పేర్కొంది. అలాగే కొత్త ప్రైవేట్ కార్లకు తప్పనిసరి థర్డ్-పార్టీ బీమా కాలాన్ని 3 సంవత్సరాల నుండి 4 సంవత్సరాలకు, కొత్త ద్విచక్ర వాహనాలకు 5 సంవత్సరాల నుండి 6 సంవత్సరాలకు పెంచాలని ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియాని కూడా ఆదేశించింది.
తన సొంత బీమా ఉన్న వాహనంలో ప్రయాణిస్తుండగా రోడ్డు ప్రమాదంలో మరణించిన వ్యక్తి కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ దాఖలు చేసిన అప్పీల్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. ఈ సందర్భంగా ఇన్సూరెన్స్ లేని వాహనాలకు పెట్రోల్, డీజిల్ కొట్టకుండా చట్టంలో మార్పులు చేయాలని రవాణాశాఖను ఆదేశించింది. ఈ ప్రతిపాదనకు పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ కూడా ఎలాంటి అభ్యంతరం వ్యక్తంచేయలేదు. రోడ్లపై ఏర్పాటు చేసిన ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ కెమెరాలను వాహన్ డేటాబేస్, ఇన్సూరెన్స్ ఇన్ఫర్మేషన్ బ్యూరోతో లింక్ చేయాలని కోర్టు ఆదేశించింది. తద్వారా బీమా లేని వాహనాలను ఆటోమేటిగ్గా గుర్తించి, వాటికి ఈ-చలాన్లు జారీ చేయవచ్చు. అలాగే ట్రాఫిక్ పోలీసులకు ఈ డేటాబేస్‌లకు లింక్ చేసిన చేతి పరికరాలు లేదా యాప్ లు ఇవ్వాలని రాష్ట్రాల్ని ఆదేశించింది.
ఈ నిబంధనలు అమల్లోకి వచ్చాక బీమా లేని వాహనాలను నడిపేవారిపై పెంచిన జరిమానాలను కఠినంగా అమలు చేయాలని ఆదేశించింది. తాజా నిబంధనలు అమల్లోకి వస్తే మొదటి సారి నేరానికి వాహనం వార్షిక బీమా ప్రీమియంకు మూడు రెట్లు లేదా 5 వేలు, ఈ రెండింటిలో ఏది ఎక్కువైతే అది జరిమానాగా విధిస్తారు. ఆ తర్వాతి నేరాలకు ప్రీమియంకు ఐదు రెట్లు లేదా 10 వేలు, ఈ రెండింటిలో ఏది ఎక్కువైతే అది జరిమానాగా విధిస్తారు. వాహనదారులు తమ బీమా స్టేటస్ తెలుసుకునేందుకు కూడా ఏర్పాట్లు చేయాలని సూచించింది. అలాగే టోల్ ప్లాజాల వద్ద ఆగకుండా టోల్ విధించేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.