* నీర్నెముల గ్రామానికి చెందిన ముత్యాల శివ (34) తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి
* చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ బాల నరసింహ స్వామి గుడి టర్నింగ్ వద్ద ఘటన
చిట్యాల (ప్రజా సంక్షేమం):
నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చిట్యాల నుంచి భువనగిరి వైపు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొట్టడంతో అదుపుతప్పి లారీ కిందపడి ఓ యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
సంఘటన వివరాలు:
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం నీర్నెముల గ్రామానికి చెందిన ముత్యాల శివ (34) చిట్యాల నుంచి భువనగిరి వైపు తన ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా, చిట్యాల పరిధిలోని శ్రీ బాల నరసింహ స్వామి దేవాలయ టర్నింగ్ వద్ద ఈ ప్రమాదం జరిగింది.
శివ వాహనాన్ని వెనుక నుంచి వచ్చిన ఒక కారు బలంగా ఢీకొట్టింది. దాంతో అదుపుతప్పిన శివ, ఎదురుగా వస్తున్న లారీ కింద పడిపోవడంతో తీవ్ర గాయాల పాలై అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. యువకుడి మృతితో నీర్నాముల గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

